Saturday, April 20, 2024

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి

- Advertisement -
- Advertisement -

CM KCR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉభయతారకంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈకాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్‌పై పోరాడుతున్నదని, ఇదే స్పూర్తితో ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే కరోనాను భారతదేశం చాలా గొప్పగా ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయన్నారు. కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తున్నదని, మీరు (కేంద్రం) అండగా నిలవడం మాకు ఎంతో మనోధైర్యం ఇస్తున్నదని సిఎం అన్నారు. కరోనాపై జరిగే యుద్ధంలో భారతదేశం తప్పక గెలిచితీరుతుందని, లాక్ డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడిందన్నారు. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడం మరింత మంచిందన్నారు. వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదని సిఎం కెసిఆర్ సూచించారు. భారతదేశానికి వ్యవసాయమే జీవిక అని, దేశానికి అన్నం పెట్టడమే కాదు, వ్యవసాయం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నదన్నారు.

135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదన్నారు. మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నామని, ఈ పరిస్థితి కొనసాగాలి…అలాగే అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలన్నారు. వ్యవసాయాన్ని కాపాడేందుకు, ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలన్నారు. –

అటు వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని సిఎం కెసిఆర్ అభ్యర్ధించారు. కనీసం రెండు నెలల పాటైనా ఈ విధానం అవలంభించాలన్నారు. రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే, మిగతావి నరేగా నిధుల నుంచి చెల్లించే విధానం రావాలన్నారు. దీనివల్ల కష్ట కాలంలో రైతులను ఆదుకోవడం సాధ్యమవుతుందని పిఎం దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా కోట్లాది టన్నుల పంటలు పండాయని, వీటిని సేకరించడం మన ముందున్న కర్తవ్యమన్నారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేదని, ప్రజలకు మూడు నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలు ముందుగానే ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఎఫ్‌సిఐలో ఉన్న నిల్వలు ఖాళీ అవుతాయని సూచించారు. అప్పుడు కొత్తగా వచ్చే పంటలను ఆ గోదాముల్లో నిల్వ చేయవచ్చునని పేర్కొన్నారు. పంటలు మార్కెట్లో ఒకేసారి జమ కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లోనే 6,849 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

ఒక్క ధాన్యం సేకరణ కోసమే ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందన్నారు. గ్రామాల్లోనే పంటలు కొని, రైతుల అకౌంట్లో డబ్బలు వేస్తున్నామని మోడీకి సిఎం కెసిఆర్ వివరించారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐకి అందిస్తున్నామన్నారు. ఎఫ్‌సిఐ నుంచి తిరిగి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం వత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. 2008లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడిందని, సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకోగలిగామన్నారు. ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడానికి కూడా వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమన్నారు.

క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్‌బిఐ అనుసరించాలన్నారు. దీన్నే హెలిక్యాప్టర్ మనీ అంటారని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులు బాటు లభిస్తుందన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుందన్నారు. జిఎస్‌డిపిలో 5 శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం ద్వారా విడుదల చేయాలని సిఎం కెసిఆర్ కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచాలని విజ్ఞపి చేశారు. రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయండి
ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయదారుల కోసం ఏమి చేయాలనే విషయంలో, ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో వ్యూహం ఖరారు చేసి, అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ తదితరులున్నారు.

Lockdown continue for another two weeks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News