వుహాన్ : కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో బుధవారం అక్కడ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు మినహా అన్నింటిపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ మొదట వ్యాపించింది కోటీ 60 లక్షల జనాభా ఉన్న వుహాన్ నగరంలోనే. ఆ తర్వాత మొత్తం హుబే ప్రావిన్స్ను నిర్బంధంలో ఉంచింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్డౌన్ను ఎత్తివేసింది. దీంతో ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం లభించింది. లాక్డౌన్ను ఎత్తివేయడంతోనే నగరంలోను రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు కూడా కస్టమర్లతో కళకళలాడాయి. అయితే చైనాలో కరోనా పూర్తిగా కట్టడి అయినట్టు కనిపించడం లేదు. మంగళవారం దేశంలో కొత్తగా 62 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించినట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. మరోవైపు పొరుగున ఉన్న జపాన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ప్రధాని షింజో అబే టోకో సహా మరో ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు.