Saturday, April 20, 2024

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం

- Advertisement -
- Advertisement -

CS and DGP

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై చేపట్టిన చర్యలను డిజిపి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. కేవలం అత్యవసర సర్వీసులు మినహా పూర్తి స్థాయిలో ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచే వారిపై, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యవసాయ, కూరగాయల సాగు పనులు చేపట్టుకోవచ్చని తెలిపారు.

జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద సమూహాలుగా కాకుండా పరిమిత సంఖ్యలో పనులు చేపట్టవచ్చని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన లాక్ డౌన్ లో భాగంగా అంతర్ రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నామని సిఎస్ తెలియ చేశారు. ఇప్పటికే ఆర్‌టిసి బస్సులు, ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, క్యాబ్‌లన్నింటినీ బంద్ చేయించామని అన్నారు. ఎక్కడకూడా 5 మంది కంటే గుమిగూడకూడదని స్పష్టం చేశారు. జీవో 45లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామ ని అన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలు వాయిదా వేస్తున్నామని అన్నారు. రోడ్‌మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలులేదని, ముఖ్యంగా రాత్రి 7 గంట ల నుంచి ఉదయం 6గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా బయట తిరిగితే పాస్ పోర్ట్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామ స్థాయిలో కరోనా వ్యాప్తి తీవ్రత అంతగా లేదని పేర్కొన్నారు. అయి తే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పకుండా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. ప్రకృతి విపత్తు సహాయక శాఖ అధికారులు ఎల్లప్పుడూ విధులను కొనసాగిస్తారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్క రూ ప్రభుత్వానికి సహకరించాలని సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. అనంతరం డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజ లు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రజా శ్రేయ స్సు, ఆరోగ్యం కోసం సోమవారం నుంచి ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జివో 45 ను పటిష్టంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలను నిషేధిస్తున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులు, అత్యవసర శాఖల వాహనాలు, మీడియా వాహనాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. తమ ఇళ్లకు సమీపం లో ఉన్న దుకాణాలనుండి మాత్రమే నిత్యావసర వస్తువు లు తేవడానికి మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈనెల 31 వతేదీ వరకు క్రమశిక్షణతో ఉండాలని కోరారు. ఈ సమస్యను అరికట్టాలంటే ప్రజలేవరూ రోడ్ల పైకి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమా జం కోసం పోలీసులు లాక్ డౌన్‌ను స్ట్రిక్‌గా ఆంక్షలు అమలు చేస్తున్నారని, ఇందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. వాహనాలు, ప్రజల రాకపోకలను నివారించేందుకై ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, సరైన కారణం లేకుండా ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని తెలిపారు.

సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చట్టం చాలా కఠినంగా అమలు చేయాలని రేంజ్ ఐజిలు, డిఐజిలు, పోలీస్ కమీషనర్లు, ఎస్‌పిలను ఆదేశించామని డిజిపి తెలిపారు. నిబంధనల అతిక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. లాక్ డౌన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టూలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిజిపి జితేందర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

 

Lockdown until the 31st of this month
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News