ఖాట్మాండూ: రాముడి నిజమైన జన్మస్థలి నేపాల్లోనే ఉందని ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీశాయి. శ్రీరాముడు నేపాల్లోని థోరీ సమీపంలో ఉన్న బిర్గుంజ్లో జన్మించారని, ఈ విధంగా నేపాల్లోనే వాస్తవికంగా అయోధ్య ఉందని ఓలి తెలిపారు. దీనిపై నేపాల్ రాజకీయ నాయకులు మండిపడ్డారు. రానురాను ప్రధాని ఓలి హద్దులు దాటి మాట్లాడుతున్నారని మాజీ ప్రధాని ఒకరు నిరసన తెలిపారు. రాముడి జన్మభూమి గురించి మాట్లాడి ఆయన లక్ష్మణరేఖను దాటారని విమర్శించారు. ప్రధాని విచక్షణారహిత మాటలకు దిగుతున్నారని, ఇవి అసందర్భ ప్రేలాపనలు అని మాజీ ప్రధాని బాబూరాం భట్టారాయ్ ట్వీటు చేశారు. ప్రధాని పదవిలో ఉన్న వారు ఇటువంటి మాటలకు దిగరాదని పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. వెంటనే ప్రధాని తమ వివాదాస్పద వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేపాల్లోనే నిజమైన అయోధ్య ఉందని ఆయన చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ప్రధాని ఓలి నుంచి ఇప్పుడు మనమంతా కలియుగ రామాయణ కథను వినాల్సి ఉంటుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
సరైన ఆధారాలు లేకుండా ఇటువంటి వ్యాఖ్యలకు దిగడం సరికాదని, భారత్తో ఉన్న సత్సంబంధాలను మరింతగా దిగజార్చేందుకు ప్రధానితో ఈ విధంగా ఎవరో మాట్లాడిస్తున్నారని మాజీ విదేశాంగ మంత్రి, హిందువుల అనుకూలమైన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కమల్ థాపా విమర్శించారు. ఇక అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత బామ్ దేవ్ గౌతమ్ స్పందిస్తూ ప్రధాని వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని ఇటువంటి మాటలతో దేశంలో, వెలుపల కూడా వివాదాన్ని రేకెత్తించారని విమర్శించారు. ప్రజల మతపరమైన విశ్వాసాలను కించపర్చినట్లు తెలిపారు. నిజమైన కమ్యూనిస్టుకు రాముడు ఎక్కడ పుట్టాడనేది ముఖ్యం కాదని, హోదాను పార్టీ విధానాలను విస్మరించి ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలకు దిగడంతో దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని అధికార పార్టీకి చెందిన మరో నేత బిష్ణూ రిజాల్ తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలతో ఇప్పటివరకూ ఆయనకు భారత ప్రభుత్వం పట్లనే ఉన్న విద్వేష భావం ఇప్పుడు భారతీయుల పట్ల కూడా కనబర్చినట్లు అయిందని నేపాల్ కనక్ సీనియర్ జర్నలిస్టు ఒకరు తెలిపారు.
Lord Rama is Nepal not Indian: PM KP Sharma Oli