Saturday, April 20, 2024

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: మిర్చి తోటలో పనికి వెళ్తూ, ప్రమాదానికి గురై, ఆరుగురు మృతి చెందిన సంఘటన సరిహద్దు రాష్ట్రంలోని దాచేపల్లి మండలం, పొందుగుల గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గం, దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 23 మంది మహిళా కూలీలు వారి స్వగ్రామమైన నర్సాపురం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామంలో మిరపకాయలు ఏరడానికి కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఉదయం 4 గంటలకు వారి పనులు ముగించుకొని 4 గంటల 30 నిమిషాలకు ఆటో ఎక్కి కూలి పనికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో వాడపల్లి బ్రిడ్జి దాటి ఆంధ్రా ప్రాంతములో పొందుగుల వద్ద ముందు నుంచి ఒక లారీ అతివేగంగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను గుద్దడం జరిగింది.

దింతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టి, అందులో ఉన్న 6గురు మహిళా కూలీలు ఇస్లావత్ మంజుల(26), భూక్యా పద్మ(28), మాలోత్ కవిత(30), ఇస్లావత్ పార్వతి(44), భూక్యా సోని(48), వడ్త సక్రి(49)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని, మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 60 వేలు బాధిత కుటుంబాలకు అందజేశారు.

మృతి చెందిన 6గురు మహిళలను గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి డిఎస్‌పి, సిఐలను ఆదేశించి, దగ్గరుండి పోస్టుమార్టం చేయించారు. వారివెంట డిసిఎంఎస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జడ్పిటిసి ఆంగోతు లలిత హతీరాం నాయక్, రైతుబంధు నల్లగొండ జిల్లా కమిటీ మెంబర్ వీరకోటిరెడ్డి, ఎండి యూసుఫ్, ఎంపిటిసి బాల లక్ష్మి సత్యనారాయణ, పెద్ద కోటిరెడ్డి, ధీరావత్ పాచు నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు ఇస్లావత్ సేవా నాయక్, మునోతు శివ నాయక్, మెగా నాయక్, కందుల నాగిరెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, అక్కురాం నాయక్, గోవర్ధన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ఆటోలో ఉన్నవారంతా కూలి పనులు చేసుకునే నిరుపేదలే..
పొట్టకూటి కోసం దూరభారమైనా సహించి, పనులకు వెళ్తున్న నిరుపేద మహిళలకు లారీ ప్రమాదం పెనుశాపంగా మారింది. వీరి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని పలువురు కోరుతున్నారు.
ఓవర్ లోడ్ ప్రమాదానికి కారణం..
ఏడుగురు ప్రయాణించాల్సిన ఆటోలో ఏకంగా 23 మంది ఎక్కడం, అందులో వెనుకభాగంలో నిల్చొని ప్రయాణిస్తున్న మహిళలే మృత్యువాత పడడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News