దర్శనానికి వెళ్లి వచ్చే లోపే ఆయిల్ ట్యాంకర్ చోరీ
యాదాద్రిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
మనతెలంగాణ/యాదాద్రి: తమ పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని తమ వాహనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నడవాలని మొక్కి పూజలు చేసుకునేందుకు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపే ఆయిల్ ట్యాంకర్ లారీ చోరి జరిగిన సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివారల ప్రకారం…
శంషాబాద్ కాటేదన్కు చెందిన కట్ట రామ్రెడ్డి తమ కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు ఉదయం 8 గంటలకు తన సొంత ఆయిల్ ట్యాంకర్ (లారీ) లో చేరుకున్నారు. స్వామి వారి దర్శనం సత్యనారాయణ వ్రత పూజల నిమిత్తం లారీని (ఏపీ136731) కొండ క్రింద పార్కింగ్ చేసి దైవ దర్శనానికి వెళ్ళి పూజల అనంతరం కొండ కిందికి రాగానే లారీ కనబడకపోవడంతో ఆవేదనకు గురై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.