వడ్డీ మాఫీతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది
సుప్రీంకోర్టుకు తెలిపిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని రుణ వాయిదాల చెల్లింపులో ఉపశమనం కలిగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే బలవంతంగా వడ్డీని వదులుకోవ డం సరైన నిర్ణయంగా అనిపించదు. ఎందుకంటే ఇది బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మరిం త దిగజార్చుతుంది. బ్యాంక్ డిపాజిటర్లు కూడా దీని భారాన్ని భరించాల్సి ఉంటుందని ఆర్బిఐ కోర్టుకు విన్నవించింది.
వాయిదాల చెల్లింపులపై మారటోరియం సమయంలో వడ్డీని వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై రిజర్వ్ బ్యాంక్ ఈ విధంగా సమాధానమిచ్చింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయిన మొదటి మూడు నెలలు, తరువాత మరో 3 నెలలు రిజర్వ్ బ్యాంక్ రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వాయిదాలను ఆగస్టు 31 తర్వాత తిరిగి చెల్లించవచ్చు. ఈ కాలంలో వాయిదా చెల్లించనందుకు బ్యాంక్లు ఎటువంటి చర్యలు తీసుకోవు. అయితే ఈ సమయంలో వడ్డీ తీసుకోకపోతే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు కోల్పోతాయని ఆర్బిఐ తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కానీ వడ్డీని మాఫీ చేయమని బ్యాంకులను బలవంతంగా కోరడం సరైన చర్యగా అనిపించదని, ఎందుకంటే ఇది బ్యాంకుల ఆర్థిక పరిస్థితికి ప్రమాదం కలిగిస్తుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా హాని కలిగిస్తుందని ఆర్బిఐ వివరించింది.