గుంటూరు: ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. హత్య జరిగిన రెండు సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్ కరీమ్ అనే యువకుడు పాలి టెక్నిక్ కాలేజీలో చదువుతుండగా తరగతి గదిలో యువతితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. చదువు ముగిసిన అనంతరం యువతి ఓ హోండా షోరూమ్లో జాబ్ చేస్తోంది. హోండా షోరూమ్లో రఫీ అనే యువకుడితో చనువుగా ఉంటుందని అనుమానించిన కరీమ్ ఆమెను ఉద్యోగం మాన్పించాడు. 2018 మే 25న తన స్నేహితుడు పెళ్లి ఉందని యువతి కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. గుంటూరులో తాను అద్దెకు తీసుకున్న రూమ్కు ఆమెను తీసుకెళ్లాడు.
అమ్మాయి తనని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో, చాలా మందితో సన్నిహితంగా ఉన్నావని పెళ్లి చేసుకోనని కరీమ్ చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అమ్మాయి బెదిరించింది. వెంటనే కరీమ్ ఆమె తలను గట్టిగా గోడకేసి కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టంగా ఉండడంతో ముక్కలు ముక్కలుగా నరికి రాత్రి సమయంలో బస్తాలో మూట కట్టి బైక్పై విజయశాంతి నగరలో శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశాడు. స్థానికులకు మూట కంటపడితే పోలీసులకు దొరికిపోతాననే భయంతో రెండు రోజుల తరువాత మూటపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. యువతి గురించి అడిగిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరుతో లేచిపోయి ఉండొచ్చని నమ్మబలికాడు. స్థానికుల సమాచారం మేరకు కాలిపోయిన మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తలపై గాయం ఉండడంతో హత్యగా అనుమానించారు. రెండు సంవత్సరాల నుంచి పలు ఆధారాలు సేకరించి కరీమ్ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు.