Thursday, April 25, 2024

పెట్టుబడుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

దావోస్‌లో తొలిరోజే రాష్ట్రానికి భారీ

ఫుడ్ ప్రాసెసింగ్‌లో రూ.500కోట్లు
పెట్టడానికి ముందుకొచ్చిన లులు
గ్రూప్ మంత్రి కెటిఆర్‌తో బేటీలో
సంస్థ అధిపతి యూసుఫ్ అలీ
సుముఖత యూనిట్ ఏర్పాటుకు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనుమతి
పత్రాలు అందజేసిన మంత్రి
కెటిఆర్ రూ.100 కోట్లతో ఇక్కడ
విస్తరణకు బ్యాంకింగ్
బీమా సంస్థ స్విస్‌రే
రూ.100కోట్లతో హైదరాబాద్‌లో
తన సంస్థను విస్తరించనున్న
స్పెయిన్‌కు చెందిన కీమో ఫార్మా
జీనోమ్‌వ్యాలీలో ఇప్పటికే
వేళ్లూనుకున్న కీమో గ్రూప్
మంత్రి కెటిఆర్‌తో భేటీ అయిన
గ్రూప్ డైరెక్టర్ జీన్‌డానియల్ బోనీ
కీమో గ్రూపుకి ధన్యవాదాలు
చెప్పిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల తొలి రోజునే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు దక్కాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం దావోస్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారకరామారావుతో జరిగిన సమావేశాల అనంతరం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా లులు గ్రూప్ రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మేరకు మంత్రి కెటిఆర్‌తో ఆ సంస్థ అధిపతి యూసుఫ్ అలీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. 500 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. అలాగే సంస్థ ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతి పత్రాలను యూసుఫ్‌అలీకి మంత్రి కెటిఆర్ అందించారు.

ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్ ప్రారంభించే ల క్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూ సుఫ్ అలీ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి విదేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండబోతున్నట్లు యూసుఫ్‌అలీ తెలిపారు. రాష్ట్రంలో తమ గ్రూప్ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల కోసం పెట్టనున్నట్లు మంత్రి కెటిఆర్‌కు యూసుఫ్ అలీ వివరించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలను ఎంచుకున్నామన్నారు. ఆయా ప్రాపర్టీ యజమానులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. కాగాహైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్ మాల్ నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని, ఇక్కడ లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వ్యవసాయోత్పత్తులకు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. ఈ దిశగా లూలు గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐదు వందల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లూలూ గ్రూప్ కి ధన్యవాదాలు తెలిపారు.

రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కీమో ఫార్మా

స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ హైదరాబాద్ నగరంలో రూ.100 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు మంత్రి కెటిఆర్‌కు తెలిపింది. స్పెయిన్ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్ నగరం లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దీనికిఅదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్‌నూ వంద కోట్లతో ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 2018 సంవత్సరం లో కంపెనీ క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించిందని కీమో ఫార్మా కెటిఆర్‌కు వివరించింది. ప్రస్తుతం స్థాపించనున్న రెండవ యూనిట్ ద్వారా తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడితో పాటు సమీప భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్‌తో పాటు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కీమో గ్రూప్ పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ తెలియజేశారు. 2018 నుంచి కార్యకలాపాలు హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా కొనసాగుతున్నాయని, అప్పటినుంచి తమ సంస్థ దినదినాభివృద్ధి చెందుతున్న విషయాన్ని డైరెక్టర్ జీన్ తెలిపారు. ఇప్పటికే తాము సుమారు రూ.170 కోట్లను పెట్టుబడిగా పెట్టామన్నారు. 270 మంది ఉద్యోగులున్నారని, త్వరలో ఈ అదనపు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమకు సుమారు 10 దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని తెలిపిన జీన్, హైదరాబాద్ నగరంలో తమ అభివృద్ధి చాలా బాగుందన్నారు.

కాగా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కీమో గ్రూప్ కి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరానికి లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న భవిష్యత్తు అవకాశాల గురించి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ కేంద్రంగా ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్న సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన స్విస్ రే

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన స్విస్‌రే హైదరాబాద్ నగరంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ కంపెనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికా స్కాట్టి, ఎండి పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్, ఇవో మెంజింగ్నర్‌లు మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వేరోనికా మంత్రి కెటిఆర్‌కు వివరించారు.. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, తర్వాత దశలవారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని తెలిపారు. తమ హైదరాబాద్ కార్యాలయం ద్వారా తమ సంస్థ యొక్క డాటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, తమ సంస్థ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపైన పని చేస్తామని తెలిపారు. తమ సంస్థకు అవసరమైన ఇన్నోవేషన్,ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణలోని టి…హర్ వంటి ఇంకుబేటర్ లతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె కెటిఆర్‌కు వివరించారు.

ఇకో సిస్టమ్ హైదరాబాద్ నగరంలో ఉంది

కాగా 160 సంవత్సరాల స్విజర్లాండ్ బీమా దిగ్గజం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికాకు ఆయన ప్ర ధన్యవాదాలు తెలిపుతూ…. హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్ ఫైనాన్స్,ఇన్సూరెన్స్ సెక్టార్ కి చెందిన అనేక కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. ఈ రంగానికి అవసరమైన అనుకూల ఇకో సిస్టం హైదరాబాద్ నగరంలో ఉందన్నారు. భారతదేశ జీవిత బీమా నియంత్రణ చేసే ఐఆర్‌డిఎ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. స్విస్ రే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున తన కార్యకలాపాలు విస్తరిస్తున్న విశ్వాసం తనకు ఉందని, హైదరాబాద్ నగరంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

లైఫ్ సైన్సెస్ రంగంపై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి కెటిఆర్

కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని మంత్రి కెటిఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లైఫ్ సైన్సెస్ రంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నగరం కొనసాగుతోందన్నారు. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో తలెత్తుతున్న సమస్యలను తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్‌లో ఇతర నగరాలకంటే ముందున్నది. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటి, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయాన్ని కలిగి ఉందన్నారు.

భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలన్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్‌పైన పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్ తో కూడుకున్నవన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కనీసం రానున్న దశాబ్ద కాలం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కేవలం మందుల తయారీ పై మాత్రమే కాకుండా నూతన మాలిక్యుళ్లను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుందన్నారు. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదని…. ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తున్నదని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ చెందిన జివి. ప్రసాద్ రెడ్డి, పిడబ్లూసి చెందిన మహ్మమద్ అథర్‌లు ఈ ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News