భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్ మృతిని ధ్రువీకరించారు. శ్వాసకోశ సమస్యలు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావడంతో గత నెల 11తేదీన లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. 1935 ఏప్రిల్ 12 జన్మించిన లాల్జీ మధ్యప్రదేశ్ కు 22 గవర్నర్ గా పనిచేస్తూ ఇవాళ మరణించారు.
దీంతో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు కేంద్రం మధ్యప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలను అప్పగించింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయికి ప్రధాన అనుచరిడిగా, భారతీయ జనతా పార్టీలో లాల్జీ టాండన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. యుపి రాజకీయాల్లో ఆయనది ఘనమైన చరిత్ర. లక్నోలో 1970లో కార్పొరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని పెద్దల సభలో అడుగుపెట్టారు. 1991లో వాజ్ పేయి లక్నో నుంచి పోటీ చేశారు. ఆయన గెలుపు కోసం టాండన్ వ్యూహకర్తగా వ్యవహరించారు. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా విధులు నిర్వహించారు.
రాజకీయాల నుంచి వాజ్ పేయి తప్పుకున్న తర్వాత లక్నో నుంచి ఒక సారి టాండన్ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో రాజ్ నాథ్ సింగ్ కోసం ఆయన లక్నో బరినుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయనను బీహార్ గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. 2019లో మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు టాండన్. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సొంత రాష్ట్రం యుపికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ తనువుచాలించారు.ఆయన మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.