వైభవంగా వేములవాడ ముస్తాబు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు
హెలికాప్టర్ సదుపాయం
మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి పెద్ద శైవక్షేత్రం వేములవాడ రాజన్న క్షేత్రం విద్యుత్ వెలుగులతో ఆల య ప్రాంగణం చూడముచ్చటగా భక్తులను ఆకర్షిస్తోం ది. ప్రధాన ఆలయంతో పాటు బీమన్న, బద్ది పోచమ్మ తదితర ఆలయాలకు రంగులు వేశారు. శుక్రవారం వరకు జరగనున్న జాతరలో భాగంగా భక్తుల కోసం ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. ఈ క్షేత్రానికి రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిశాలను భక్తులు రానున్నారు. నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకెలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఇతర శైవక్షేత్రాలు కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ప్రముఖంగా రామలింగేశ్వర దేవస్థానం (కీసరగుట్ట), మల్లికార్జునస్వామి దేవస్థానం(కొమురవెల్లి), ఛాయా సోమేశ్వరాలయం(నల్గొండ), వేయిస్తంభాల గుడి (హన్మకొండ), రామప్పదేవాలయం(వరంగల్), సంగమేశ్వర ఆలయం(మహబూబ్నగర్)లు శివరాత్రి ఉత్సవ వేడుకలకు సన్నద్ధమయ్యాయి. రాష్టవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాలు సైతం శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశాయి. ఉదయం నుంచే భక్తుల తాకిడి ఉన్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటు నుంచి భక్తులకు ఎలాం టి అసౌకర్యాలు కలగని విధంగా ఆయా ఆలయాల్లో వసతులను సమకూర్చారు.
వేములవాడలో ప్రారంభమైన శివార్చన
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో గురువారం శివార్చన కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలు ఆహుతులను అలరించాయి.ఈ వేడుకను తిలకించడానికి పట్టణ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ చెన్నమనేని రమేష్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Maha Shivaratri Celebrations in Telangana