హైదరాబాద్: కరోనా కష్టకాలంలో దుష్ప్రచారం చేయొద్దని మంత్రి కెటిఆర్ సూచించారు. మూడేళ్లలోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. మెడికల్ కాలేజీని ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే మహబూబ్నగర్ రూపురేఖలు మార్చామని, కార్పొరేటు స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కరోనాతో రాజకీయం చేయడం సరికాదని, కరోనాకు పేద, ధనిక అనే తేడాలు లేవని, ఎవరికైనా రావొచ్చన్నారు. తెలంగాణలో వేలల్లో కరోనా కేసులు వచ్చినా 98 శాతం మంది కోలుకున్నారని, ప్రభుత్వం ఆస్పత్రులపై నమ్మకం కలిగిందన్నారు. కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదన్నారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో విపక్షాలు చెప్పాలని, కరోనా ఇప్పట్లో పోయే అవకాశం లేదన్నారు. కరోనాతో రెండు శాతం మరణాలు ఉన్న మాట వాస్తవమేనని, 98 శాతం రికవరీ ఉందన్నది మర్చిపోవొద్దన్నారు. దేశంలో 40 శాతం ఔషధాలు హైదరాబాద్లో నుంచే ఉత్పత్తి అవుతున్నాయని కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.