జిల్లా అధ్యక్షుడు రాజీనామ
పిసిసి చీఫ్ ను కలసిన ఎర్ర శేఖర్
త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బిజెపికి పెద్ద షాక్ తగిలింది. ఏకంగా జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఎర్ర శేఖర్ ప్రకటించారు. వెంటనే తమ రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. వాస్తవానికి ఎర్రశేఖర్ గత కొంత కాలంగా జిల్లా బిజెపిలో ఉన్న వర్గవిభేదాల కారణంగా అసంతృప్తితోనే ఉన్నారు. ఎర్ర శేఖర్ జిల్లా అధ్యక్షుడు కావడాన్ని ఆ పార్టీ లోని ఒక వర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయంతో సద్దుమణిగింది.
అనంతరం ఎర్ర శేఖర్ కు పార్టీలోని కొంతమంది పెద్దల మద్దతు లభించలేదు. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలోనూ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ను పిలవకుండానే ప్రెస్ మీట్లు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్యతో తీవ్రమనస్తాపానికి గురైన ఎర్ర శేఖర్ వెంటనే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన అతి కొద్ది సమయంలోనే జిల్లా అధ్యక్షుడు రాజీనామ చేయడాన్ని బిజెపి తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అయినప్పటికీ బిజెపిలో లుక లుకలు ఆగలేదు. ఈ పరిణామాల నేపద్యంలో ఎర్ర శేఖర్ మంగళవారం పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో బిజెపిలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు బయట పెడతానని వెల్లడించారు.