మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి ఆదేశాలిచ్చారు. మహారాష్ట్రలో నేటి వరకు మొత్తం 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించడంతో కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
మహారాష్ట్రలో కరోనా ప్ర భావం తగ్గే వరకు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులలో రాకపోకల బంద్ చేయాలని, అత్యవసర, నిత్యవసర వస్తుసామాగ్రిని తరలించే వారిని మాత్రం వైద్య పరీక్షలు చేసిన అనంతరం అనుమతించాలని రాష్ట్ర పోలీసు అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. కూరగాయలు, నిత్యవసర వస్తువుల సరఫరా చేసే వాహనాల డ్రైవర్లకు కరోనా వైరస్కు సంబంధించిన ప్రాధమిక పరీక్షలు చేపట్టిన అనంతరమే వారిని రాష్ట్రంలోకి అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు.
ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్వద్ద పోలీసులు, వైద్యాధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిని నిశితంగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రతి చెక్పోస్టు వద్ద పోలీసు అధికారులతో పాటు రవాణా శాఖ నుంచి ఇన్స్పెక్టర్స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అ క్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాం తాల్లో పోలీసు సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ‘కరోనా వైరస్’ దావానంలా విస్తరిస్తుండడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి, వాహనదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నైట్లెతే వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం సమీపంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును పోలీసు ఉన్నతాధికారులు శనివారం నాడు పరిశీలించారు. అక్కడ నుంచి వచ్చి పోయే వాహనాలను పరిశీలించిన పోలీసు అధికారులు వాహనదారులకు వైద్యపరీక్షలకు నిర్వహించాలని సూచించారు. ఎవరికైనా ఈ వైరస్ మహమ్మారి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షల నిమత్తం ఆస్పత్రికి తరలించాలన్నారు.