ముంబయి: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది మార్చిలో రద్దయిన సబర్బన్ రైలు సర్వీసులను ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణికుల కోసం పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను సబంధిత రైల్వే శాఖ అధికారులకు తెలియచేశామని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ నుంచి ప్రకటన త్వరలో వెలువడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల కోసం లోకల్ రైళ్లను నడపడానికి అనుమతించాలని పశ్చిమ, మధ్య రైల్వే చీఫ్ జనరల్ మేనేజర్స్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ కోరినట్లు ఆయన చెప్పారు. గత ఏడాది మార్చి నుంచి లోకల్ రైళ్లు రద్దు కాగా అత్యవసర సర్వీసులకు చెందిన కార్మికుల కోసం వీటిని గత జూన్లో పునరుద్ధరించారు. సాధారణ ప్రయాణికులకు మాత్రం అనుమతించడం లేదు. ప్రస్తుతం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే లోకల్ రైలు సర్వీసులకు అనుమతి ఉంది.