హైదరాబాద్ : నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి భారీ వరద పోటెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు వరదలతో నగర ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. మూసీ నదికి వరద పోటెత్తడంతో నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ ప్రవహించింది. 1908లో మూసీ నదికి భారీ వరదలు రావడంతో.. నాటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు వందేళ్ల తర్వాత మూసీకి మళ్లీ వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో వరదల నుంచి హైదరాబాద్ను గట్టెక్కించాలంటూ పురానాపూల్ వద్ద మూసీ నదికి బుధవారం హోంమంత్రి మహముద్ అలీ శాంతి పూజ చేశారు. గంగమ్మ తల్లికి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. అక్కడున్న దర్గాలో మహముద్ అలీ చాదర్ సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.