న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు ప్రమాదకరమైనవని కాంగ్రెస్ విమర్శించింది. ఈ లేబర్ కోడ్స్తో దేశంలో కార్మిక సంఘాలు బలహీనపడుతాయని, శ్రామికుల భద్రతా వ్యవస్థ చెదిరిపోతుందని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మల్లిఖార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ స్థాయిల్లోని వర్కర్ల పని భద్రతకు తూట్లు పొడవడం సరికాదని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సెషన్ దశలో ఈ బుధవారం మూడు లేబర్ కోడ్స్ ఆమోదం పొందాయి. కంపెనీల మూసివేతపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, 300 మంది వరకూ వర్కర్లపై ప్రభుత్వ అనుమతి లేకుండానే తొలిగింపు చర్యలు తీసుకునేలా చేయడం, లేఆఫ్లకు దిగడం వంటివి ప్రమాదకర అంశాలుగా ఉన్నాయని గతంలో కేంద్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన ఖర్గే చెప్పారు. చేజేతులా కార్మిక సంఘాలను నీరుగార్చడం, వర్కర్ల భద్రతను దెబ్బతీయడం జరిగిందన్నారు. కంపెనీలు సజావుగా సాగేందుకు ఈ బిల్లులు దోహదపడుతాయని ప్రభుత్వం చెప్పడం కట్టుకథ అని ఎదురుదాడికి దిగారు.