వరంగల్: జల్సాల కోసం ఓ కారు డ్రైవర్ను హత్య చేసి కారు దొంగతనం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్కుమార్ తెలిపారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాలకుర్తి మండలం రాఘవాపురం బస్స్టేజి వద్ద గత నెల 23వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం రాగా పాలకుర్తి పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడు హన్మకొండ కుమార్పల్లి ప్రాంతానికి చెందిన మడత నర్సింహ(47)గా గుర్తించారు. మృతుడు ఒక కారు కొనుగోలు చేసి ట్రావెల్స్ నడుపుకుంటున్నట్లు దర్యాప్తులో తేలగా ఎవరు హత్య చేశారనే విషయం మిస్టరీగా మారింది. అయితే పాలకుర్తి మండల కేంద్రంలో కేబుల్ నెట్వర్క్ నిర్వహిస్తున్న పరాంకుశం రోషన్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సిపి తెలిపారు.
నిందితుడు రోషన్ కేబుల్ నెట్వర్క్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయం తనకు జల్సాలకు సరిపోకపోవడంతో డబ్బు సులభంగా సంపాదించాలనే గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. నాలుగు ద్విచక్రవాహనాలు చోరీ చేసి వాటిని అమ్ముకొని ఆడబ్బుతో జల్సాలు చేశాడు. గత నెల 23వ తేదీన కాజీపేట నిట్ ప్రాంతంలో మృతుడు నర్సింహ కారును జనగాంకు కిరాయి మాట్లాడుకొని తీసుకొని వచ్చి రాఘవాపురం శివారులో డ్రైవర్ నర్సింహపై పెప్పర్స్ప్రే కొట్టి నిందితుడిని కిందపడేసి బండతో తలమీద కొట్టి హత్య చేసి మృతుని కారును తీసుకొని వెళ్లి దాచిపెట్టాడు. ఈ విషయమై పాలకుర్తి పోలీసులు అధునాతన టెక్నాలజీ సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. నిందితుడి వద్ద నుండి ఒకకారు, నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ఫోన్లు, రెండు పెప్పర్స్ప్రే బాటిళ్లు స్వాధీన పరుచుకొని నిందితుడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.