మనతెలంగాణ/మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిసి బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రవి మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలు కాగా వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి ఉట్పూర్ వెళ్తున్న ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టిసి బస్సు చెన్నూర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఇసుక లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు బోల్తాపడగా బస్సులో సుమారు 16 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ ఉన్నారు. లారీ డ్రైవర్ రవి క్యాబిన్లో ఇరుక్కుపోగా లక్షెట్టిపేట సిఐ నారాయణనాయక్, ఎస్ఐలు శ్రీకాంత్, దత్తాత్రిలు జెసిబి సాయంతో బయటకుతీసి 108 అంబులెన్స్లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆర్టిసి బస్సు డ్రైవర్ తిరుపతి, జగిత్యాలజిల్లా ధర్మపురికి చెందిన రాధాకృష్ణ, జన్నారం మండలం చింతగూడకు చెందిన యశోద, దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజవ్వ, జన్నారంకు చెందిన శేష్కుమార్లకు తీవ్రగాయలు కాగా వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల, కరీంనగర్ ఆసుపత్రిలకు తరలించారు. వాహనాలు బోల్తా పడడంతో గంటన్నర పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ రహదారిపై రాకపోకలు నిలిచాయి. మంచిర్యాల డిసిపి విజయ్కుమార్రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Man dies after RTC bus crashes into Lorry in Mancherial