మన తెలంగాణ/ కుల్కచర్ల: తామర పువ్వుల కోసం చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి మునిగిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం మోత్కూర్ గ్రామంలో జరిగింది. వెంకటరాములు- బాలమ్మ అనే దంపతులు పండ్లు, పువ్వుల వ్యాపారం చేసేవారు. వినాయక చవితి సందర్భంగా తామర పువ్వుల కోసం చెరువుల్లో నుంచి తీసుకొస్తారు. ఈ క్రమంలో దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలోని నీటి కుంటలో తామర పువ్వులు గమనించిన వెంకటరాములు(55) వాటిని తెంపేందుకు కుంటలోకి దిగాడు. భర్త ఎంతకు నీటిలోంచి బయటకు రాకపోవడంతో అతని భార్య బాలమ్మ కేకలు వేయడంతో గ్రామస్థులు కుంట వద్దకు చేరుకున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో కుంటలో గాలించిడంతో నాచులో ఇరుక్కుపోయిన వెంకటరాములు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు నాగర్కర్నూల్ జిల్లా కోలాపూర్ గ్రామానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
తామర పువ్వుల కోసం కుంటలోకి దిగిన వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -