మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంథని మున్సిపల్ కమిషనర్పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పెద్దఎత్తు పలు రకాలుగా ముందస్తూ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు, కళాశాలకు, సినిమా థియేటర్లను ఈ నెల ౩1వ తేదీ వరకు మూసివేసింది. అలాగే సభలు, సమావేశాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకకుండా అన్ని ప్రభుత్వ విభాగాలతో కూడిన కమిటీలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తోంది. కరోనా సోకకుండా ఒకవైపు పకడ్బంది చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.
ఇందులో క్షేత్ర స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాత్ర చాలా కీలకంగా మారింది. అలాగే కరోనా విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వవద్దంటూ ఇప్పటికే అన్ని విభాగాలకు చెందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ని సైతం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంథని మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న గుట్టల మల్లికార్జున స్వామి కరోనా విధులకు దూరంగా ఉండడంతో పాటు ఒక రోజు సెలవు తీసుకున్నారు.
అలాగే మంథని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్ళును పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరం (2019…2020) ముగియడానికి మరో పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో వైన్ షాప్ల నుండి రావాల్సిన లైసెన్స్ రుసుము గురించి తాను లేకుండానే శానిటేషన్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పలు వైన్షాప్లు సీజ్ చేయించారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కీలకంగా ఉన్న వైన్ షాప్ ల సీజ్ అంశాన్ని సీరియస్ గా తీసుకొన్న ఆ శాఖ కమిషనర్ మరియు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ సూచన మేరకు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.
గతంలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ మేనేజర్ గా ఉన్న గుట్టల మల్లికార్జున స్వామి గత సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ 2019న మున్సిపల్కమిషనర్గా విధుల్లో చేరారు. ఏడాది కాలంగా మంథని మున్సిపల్ కమిషనర్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. మున్సిపాలిటీకి పాలకమండలి లేని సమయంలోనే పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని స్వచ్ఛ మంథనిగా తీర్చిదిద్దారు. అయితే నూతన పాలకవర్గం వచ్చిన 50 రోజుల్లోనే హఠాత్తుగా సస్పెండ్ కావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.