దంతేవాడ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మందుగుండు సామాగ్రి నిల్వలను భద్రతా బలగాలు కనుగొన్నాయి. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న దంతేవాడ జిల్లాలోని అడవులలో ఓ కొండపై ఈ పేలుడు పదార్థాల డంప్ను ఛేదించినట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. దువలికర్క గుట్టల మధ్య తిరిగే ప్రజల నుంచి తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయని దంతేవాడ జిల్లా ఎస్పి అభిషేక్ పల్లవ తెలిపారు. జిల్లా రిజర్ గార్డ్ (డిఆర్జి) బృందం అక్కడికి వెళ్లిందని వివరించారు. అదునుచూసుకుని భద్రతా బలగాలపై దాడికి వినియోగించుకునేందుకు ఈ డంప్ను మావోయిస్టులు ఇక్కడ భద్రపర్చుకున్నట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాల డంప్లో అయిదేసి కిలోల బరువైన రెండు టిఫిన్ బాంబులు, మూడు పైపు బాంబులు, రెండు బ్యాటరీలు, 50 మీటర్ల వైర్, ఐఇడిలను పేల్చేందుకు గాలిని పంపించే సిరంజీలతో కూడిన బాక్స్ వంటివి ఈ డంప్లో ఉన్నాయి. అక్కడ మావోయిస్టుల అనుబంధ సంస్థ చేత్న నాట్య మండలి, మావోయిస్టుల అజ్ఞాత సాహిత్యం కనుగొన్నట్లు పోలీసు అధికారి వివరించారు.
దంతేవాడ గుట్టపై నకల్స్ డంప్
- Advertisement -
- Advertisement -
- Advertisement -