Thursday, April 25, 2024

‘రా’ రైస్‌కు రాష్ట్రం అనువుకాదు

- Advertisement -
- Advertisement -

Mareddy Srinivas reddy fires on Kishan Reddy

కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్

అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు
కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో సిఎంఆర్ కింద బాయిల్డ్ రైస్‌ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కి అప్పగిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దశాబ్దలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోందన్నారు. యాసంగిలో 90 నుంచి 95 శాతం వరకు సిఎంఆర్ కింద బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సిఐకి అప్పగిస్తూ వస్తున్నారన్నారు. దీనికి ప్రధానమైన కారణం యా సంగి సీజన్ సమయంలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత వల్ల రా రైస్ (పచ్చి బియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదన్నారు.

ధాన్యాన్ని రా రైస్‌గా మారిస్తే బ్రోకెనులు (నూకలు) 30 నుంచి 40 శాతం వరకు వస్తాయని, దీనికి ఎఫ్ సిఐ అనుమతించదన్నారు. కేవలం 25శాతం వరకు మాత్ర మే అనుమతిస్తోందన్నారు. అందుకే యాసంగి లో రా రైస్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి బాయి ల్డ్ రైస్‌ను ఇస్తున్నామని సోమవారం విడుదల చే సిన ఒక ప్రకటనలో మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా అర్థరహితంగా… అసంబద్ధంగా కేంద్ర మంత్రి కి షన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇదే విషయాన్ని కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంత మంది బిజెపి నాయకులు ధర్నాలు చేయడం.. పర్యటనలు చేయడం మానేసి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులను మోడీకి వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

కేంద్రం ఆదేశాలనే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి

ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు సమచారాన్ని వ్యూహాత్మకంగా ఒక వర్గం సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరిని బియ్యంగా మార్చే నిష్పత్తి ( ఒటిఆర్….-ఔట్ టర్న్ రేషియో)ను సాధారణ రకం అయితే 67శాతం, బాయిల్డ్ రైస్ అయితే 68శాతంగా కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల క్రితం గోకర్ కమిటీ సిఫార్సులపై నిర్ధారించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వాటినే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఒటిఆర్‌ను కనిష్టంగా, గరిష్టంగా నిర్ధారించడం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. 1973లో ఇందిర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ధాన్య సేకరణ అనేది కేంద్ర జాబితాలోని అంశమన్నారు.. కొన్ని రాష్ట్రాలు కొనుగోలు కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా ఎఫ్‌సిఐకి పెడుతున్నాయన్నారు. అయితే తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సిరావడమేనని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం రెండు నెలలకే వడ్డీ చెల్లిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన నెల, రెండు నెలల తర్వాతే నిధులను విడుదల చేస్తోందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతోందని మారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ప్రొక్యూర్‌మెంట్ ఎజెన్సీలుగా పని చేస్తున్నాయన్నారు. అంతేగానీ రాష్ట్రాలు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి, నిల్వ ఉంచుకొని వ్యాపారం చేయడం సాధ్యం కాని పని అని ఆయన పేర్కొన్నారు. పైగా నిల్వ సౌకర్యాలు కూడా రాష్ట్రాలకు లేవన్నారు. కేంద్రం రెండు నెలలకు మాత్రమే వడ్డీ చెల్లిస్తోందని, రాష్ట్రం దాదాపు 10 నెలల వడ్డీని భరిస్తోందన్నారు. అలాగే డిమాండ్‌కు తగ్గట్టు కేంద్రం స్టోరేజ్ స్పేస్ చూపించడం లేదన్నారు. వ్యాగన్ మూమెంట్ కూడా సరిగా చేయడం లేదన్నారు. దీని వల్ల సిఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరిగి ప్రభుత్వంపై వడ్డీ భారం పెరుగుతోందన్నారు. ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల స్టోరేజ్ ఛార్జీలు భరిస్తే అందులో కేంద్రం కేవలం 2 నెలలకు మాత్రమే చెల్లిస్తోందన్నారు.

హామీలు ఛార్జీలను చెల్లించే విషయంలోనూ వివక్షే

రాష్ట్రానికి హమాలీ ఛార్జీలు ఒక్క క్వింటాల్‌కు కేంద్రం రూ.5.65 మాత్రమే చెల్లిస్తోందన్నారు. అదే పంజాబ్, హర్యానాల్లో ఒక క్వింటాల్‌కు రూ. 24.25లకు చొప్పున చెల్లిస్తోందన్నారు. దీనిని బట్టే రాష్ట్రంపై కేంద్రం ఏ విధంగా వివిక్ష చూపిస్తున్నదో తెలుస్తోందన్నారు. కనీసం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను కూడా సమకూర్చడం లేదన్నారు. గత ఏడాది యాసంగి సీజన్‌లో గన్నీ సంచులు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోడిగారికి విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు.

వరిని పండించవద్దని చెప్పడం మరీ విడ్డూరం

ఎక్కువగా ధాన్యం పండించమని ప్రోత్సాహించాల్సింది పోయి, వరి పండించకూడదని కేంద్రం చెప్పడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా కేంద్రాన్ని మారెడ్డి ప్రశ్నించారు. పైగా పంట పండిన తరువాత పచ్చిబియ్యమే కావాలనడం కూడా ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ఈ బియ్యంమే ఇవ్వాలి… ఆ బియ్యమే ఇవ్వాలంటూ కేంద్రం ఆంక్షలు విధించడం తెలంగాణ రైతంగానికి గొడ్డలిపెట్టులాంటిదని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల భారాన్ని భరించలేక చాలా రాష్ట్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదన్నారు. ఒరిస్సా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని…దీనిని బట్టి పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News