Thursday, March 28, 2024

ఇంటివద్దకే మేడారం ప్రసాదం

- Advertisement -
- Advertisement -

Medaram prasadam door delivery by TSRTC

ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్‌టిసి, తపాలా. ఐటి శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్‌టిసి, ఐటి శాఖల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి భారత పోస్టల్ సర్వీస్, ఆర్‌టిసి కొరియర్ సర్వీసుల ద్వారా నేరుగా ఇంటికి చేరవేస్తామన్నారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం బంగారు ప్రసాదం అమ్మవారికి సమర్పించి అనంతరం భక్తులకు చేరవేస్తామన్నారు. ఇది కావాలనుకునే భక్తులకు ఆన్‌లైన్‌లో మీ సేవ లేదా టియాప్ ఫోలియోలో బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఈ సేవలకు (ఒక ప్రసాదం ప్యాకెట్ కోసం రూ.225లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫొటోను భక్తులకు ఇంటి వద్ద అందచేస్తామన్నారు. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో ఇంటికే ప్రసాదం అందించే సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

మేడారానికి పార్శిల్ ద్వారా మొక్కు

మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టిఎస్ ఆర్‌టిసి పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శిల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క- సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్‌లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ, సంస్థ నష్టాలను చూసుకోకుండా భక్తుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సంస్థ ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రారంభించిందని, మేడారం భక్తులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బన్‌స్టేషన్ల నుంచి ఈ సేవల భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు.

బస్ స్టేషన్లతో పాటు ముఖ్య కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫొటో కూడా అందజేస్తామన్నారు. దీనికిగాను 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చని ఆయన తెలిపారు. మిగతా వివరాలకు టిఎన్ ఆర్‌టిసి కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లతో పాటు వెబ్‌సైట్ https://www.tsrtc.telangana. gov.in ను సంప్రదించవచ్చన్నారు.

మేడారం జాతరకు
2,200 స్పెషల్ బస్సులు
మేడారం మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19వరకు కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ రీజియన్‌లోని పలు ప్రాంతాల నుంచి 2,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు టిఎస్ ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హైదరాబాద్, కరీంనగర్ జోన్స్) పివి మునిశేఖర్ సోమవారం వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో మూడు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు 900 బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ స్పెషల్ బస్సులు ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్పెషల్ బస్సుల సంఖ్య 3,845కు చేరిందన్నారు. ప్రత్యేక బస్సుల్లో 21 లక్షల మందిని తరలించే అవకాశం ఉందన్నారు. మేడారం జాతర వద్ద తాత్కాలిక బస్టాండ్‌లనును ఏర్పాటు చేసినట్లు పివి మునిశేఖర్ తెలిపారు. ఆర్‌టిసి బస్సులను మాత్రమే జాతర వద్దకు అనుమతిస్తామని, ప్రైవేటు వాహనాలను నార్లపూర్ గ్రామం వరకే అనుమతించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జాతర నేపథ్యంలో స్పెషల్ బస్సుల నిర్వహణకు 12,200 మంది ఆర్‌టిసి సిబ్బందిని కేటాయించామ న్నారు. ఇందులో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీ సేవల కింద మూడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News