మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో రాత్రి ఏడు గంటల వరకే మందుల దుకాణాలు తెరవాలని హైదరాబాద్ పశ్చిమ మండల ఔషధ దుకాణాల అసోసియేషన్ నిర్ణయించింది. హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు, నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయాన్ని చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారం పాటు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేయాలని దుకాణాల యజమానుల సంఘం నిర్ణయిచింది.
ముఖ్యంగా నగరంలో వివిధ ఔషధ దుకాణాల్లో పని చేస్తున్న ఫార్మాసిస్టులకు ఇప్పటికే కరోనా సోకిన విషయంపై చర్చించారు. దీంతో నగరంలో రాత్రి 7 గంటలకే మందుల దుకాణాలను వచ్చే నెల 15వరకు అమలు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల అసోసియేషన్ అత్యవసర సమావేశమై జులై 15 వరకు రాత్రి 7 గంటలకే మెడికల్ షాపులను మూసివేయాలని మెడికల్ షాపుల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు.