మీరట్: కోవిడ్-19తో గంటల వ్యవధిలోనే కవల పిల్లలు మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. 24 ఏళ్ల జాఫ్రెడ్, రాల్ఫ్రెడ్ ఇద్దరు కవలలు. వీరిద్దరూ ఇంజినీర్స్, వారి తల్లిదండ్రులు టీచర్లు. కాగా, మే 1వ తేదీన ఆ కవలలకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆనంద్ ఆస్పత్రిలో చేర్పించారు. పదిరోజుల తర్వాత మరోసారి టెస్టులు చేయగా, కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కవలల్లో ఒకరికి మే 13 రాత్రి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో 11 గంటల సమయంలో మృతిచెందాడు. మే 14న తెల్లవారుజామున మరో కొడుకు కూడా మరణించాడు. చేతికొచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Meerut twins died due to Covid-19