160 మంది గల్లంతు!
సర్ఫ్సైడ్ : అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ఓ పలు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఇప్పటివరకూ నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. అయితే దాదాపు 160 మంది జాడ తెలియకుండా పోయింది. మియామీ ప్రాంతంలోని సముద్ర తీరం వెంబడి 12 అంతస్తుల భవనం ఉన్నట్లుండి కూలింది. ఇప్పుడు ఈ భవనం శిథిలాల దిబ్బగా మారింది. కాంక్రీటు, లోహ ఫలకాల కింద మరిన్ని మృతదేహాలు ఉండి ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. ఈ ఛాంపియన్ టవర్స్ చాలా ఏళ్లుగా పగుళ్లతో ఉందని, సముద్ర తీరంలో ఉండటంతో అలల తాకిడితో ప్రభావితం అయి, పక్కకు ఒరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు పెద్ద చప్పుడుతో జారిపడుతున్నాయి. ఈ క్రమంలో కింద చిక్కుపడ్డ వారు ఎటువంటి దుస్థితిలో ఉంటారనేది ఆందోళన కల్గిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనపై మియామీ డాడే మేయర్ డెనిలా లెవిని కెవా స్పందించారు. పెద్ద ఎత్తున సహాయ చర్యలు జరగుతున్నాయని, సిబ్బంది చాలా కష్టపడి చిక్కుపడ్డ వారిని వెలికి తీస్తున్నట్లు తెలిపారు.