9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం
కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం
దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం
ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన తొమ్మదిమంది మృతదేహాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు పేర్కొన్నారు. 9 మంది మృతదేహాలను ఎంజీఎం దవాఖానా వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రులు వేర్వేరుగా పరిశీలించారు.
మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు కలిసి పరామర్శించారు. ఈ ఘటనపై మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు విచారకరమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేస్తున్న సమయంలో ఏ ఒక్క వలస కార్మికుడు కూడా ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న సమయంలో ఇలా తొమ్మిది మంది వలస కార్మికులు చనిపోవడం చాలా దురదృష్టకరమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తొమ్మిది మంది మృతికి గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టం వచ్చాక నిజానిజాలు తెలుస్తాయని, దీనికి బాధ్యులైన దోషులను వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, వారు తీసుకెళ్లడానికి వస్తే అన్ని విధాలా సహకరిస్తామని, లేకున్నా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, పోలీస్ కమిషనర్ రవీందర్లను సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.