మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా సొంతూరు చతీస్గడ్కు కాలినడకన బయలుదేరిన అనితాబాయ్ మార్గమధ్యంలో నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్లో మంగళవారం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన సమాచారం అందుకున్న పోలీసులు తల్లీ,బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్కు చెందిన అనితబాయ్, లోకేష్ దంపతులు తమ సొంతూరుకు చేరుకునేందుకు సోమవారం సాయంత్రం కాలినడకన బయలు దేరారు. ఈక్రమంలో అనిత నిండు గర్భిణి అయినప్పటికీ 70 కిలోమీటర్ల మేరకు నడిచారు. ఈ క్రమంలో ఆమె నడుస్తుండగానే మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పురిటి నొప్పులు రావడంతో నడిరోడ్డుపైనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు అనితను రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు నర్సింగ్ ఎస్ఐ రాజేష్ తెలిపారు.