సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
– చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్
వలస కార్మికులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం
డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 1.22 లక్షల మంది వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రైల్వేస్టేషన్ల నుంచి వారి స్వరాష్ట్రాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ప్రత్యేక రైలును సోమేష్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి 6 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళుతున్నాయని, మరో 40 రైళ్లు వివిధ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేల వలస కార్మికులను వివిధ ప్రాంతాలకు రవాణా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వలస కార్మికులకు రైల్వే వారు ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికుడికి రెండు ఆహార పొట్లాలు, 3 లీటర్ల త్రాగునీరు, పండ్లను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా సమన్వయంతో మానిటరింగ్ చేసిన పోలీసులను ఇతర శాఖల అధికారులను ఆయన అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్ట్రర్ చేసుకున్న వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. వీరిలో చాలా మంది తెలంగాణకు తిరిగి రావడానికి కార్మికులు సుముఖంగా ఉన్నారని సోమేష్కుమార్ పేర్కొన్నారు. డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునఃనిర్మాణంలో వలస కార్మికులు భాగమన్నారు. ఆపదలో ఉన్న వలస కార్మికులను సురక్షితంగా వారి సొంత పట్టణాలకు గౌరవప్రదంగా పంపించడం తనకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆదనపు డి.జి. (లా అండ్ ఆర్డర్) జితేందర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా జాయిట్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.