న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ దేశవ్యాప్తంగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా రోడ్లపైకి వస్తుండడంతో ఆయా రాష్ట ప్రభుత్వాలకు ఈ సమస్య ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం పలుచోట్ల వలసకూలీలు పడుతున్న ఇబ్బందులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వలస కార్మికుల పట్ల ఆయా ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. స్థానికులు కూడా వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, వారికి తిండి, వసతి ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్య జీవనం, కష్టసుఖాలను పంచుకోవడం భారతీయ జీవనశైలికి మూలం అని ఆయన పేర్కొన్నారు. వలస కార్మికుల సమస్యను చక్కదిద్దాలంటూ కేంద్రంతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ వలస కార్మికుల అంశంలో సరైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
Migrant workers faced many problems: Venkiah Naidu