హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో పిపిపి పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సూచన మేరకు ఎల్ అండ్ టి సంస్థ వరంగల్ నగరంలో ఈ సంస్థకు చెందిన మైండ్ట్రీ అనే సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతిస్తూ ప్రకటనను వెలువరించిందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్లో వెల్లడించారు.
ఇది ప్రధానంగా వరంగల్ నగర వాసులకు, తెలంగాణ ప్రజలకు శుభవార్త అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మైండ్ట్రీ సంస్థను బెంగళూరు, న్యూజెర్సీ నగరాల్లో 1999లో ఎల్ అండ్ టి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 20,204 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక మిలియన్ డాలర్ల టర్నోవర్ చేస్తున్నది. ప్రస్తుతం 18 దేశాల్లో 43 మైండ్ట్రీ కేంద్రాలున్నాయి. వరంగల్ నగరంలోప్రారంభించే కేంద్రంతో మైండ్ట్రీకి 44వ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. దీంతో ఆ నగరంలోని యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే శుభవార్తను మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.