Friday, April 19, 2024

త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

Minister Harish rao review on construction of new Medical Colleges

ఆరోగ్య, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణంపై మంగళవారం బిఅర్‌కె భవన్‌లో ఆరోగ్య, అర్ అండ్ బి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి పేదబిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు.

నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబిబిఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టర్షియరి కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ రమేష్ రెడ్డి, కాళోజీ వర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, సిఇ రాజేందర్, ప్రొఫెసర్ విమల థామస్, అర్ అండ్ బీ ఇఎన్‌సి గణపతి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News