గొల్లపల్లి: ప్రతీ పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెళ్లి భారం కావద్దనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి అందించే బహుమతి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వైశ్య భవన్లో మండలంలోని ఆయా గ్రామాల వారీగా 74 మంది లబ్ధ్దిదారులకు మంజూరైన రూ.74,08,584 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తలకు మించిన అవుతున్న సందర్భంలో డబ్బులు కూడబెడితే తప్ప.. ఆడపిల్ల పెళ్లి తంతు కావటం లేదు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లంటే జీవితకాలం కూడబెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకే పేదల సంక్షేమం కోసం బహుమతిగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన జబర్దస్త్ షో కమెడియన్ అవినాష్ బిగ్బాస్ షోలో మంచి ప్రతిభ కనబరుచడం పట్ల మంత్రి అభనందిస్తూ అవినాష్ను సన్మానించారు.
సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ…
గొల్లపల్లి మండలంలోని గ్రామాల వారీగా 54 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధ్దిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా ఉంటూ, ఒక సోదరునిలా, పెద్ద కొడుకులాగా తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నక్క శంకరయ్య, జడ్పిటిసి గోస్కుల జలంధర్, ఎఎంసి చైర్మన్ ముస్కు లింగారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్, చందోలి విండో చైర్మన మాధవరావు, ఉప సర్పంచ్ మారం రాజశేఖర్, ఎంఆర్ఓ నవీన్కుమార్, టిఆర్ఎస్ నాయకులు పడాల జలంధర్, కనుకుంట్ల లింగారెడ్డి, కచ్చి కొమురయ్య, చౌటపల్లి తిరుపతి, జానప వెంకటేష్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
Minister Koppula Eshwar Distributed Kalyana Lakshmi checks