హైదరాబాద్: ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు ఉండేవని ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ కమ్యూనిటీ వ్యాపారుల ఆధ్వర్యంలో వైబ్రంట్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరేళ్ల క్రితం హైదరాబాద్ లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామకవేత్తలు ధర్నాలు చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో కరెంట్ సమస్యలు పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగం అభివృద్ధికి సూచికన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని హర్షం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథాకాలతో పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని వివరించారు. మనందరి కోసం పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు రెట్టింపు చేశామని ఆయన తెలిపారు. ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించడంలో తెలంగాణ సఫలమైందన్నారు. ఫ్లైఓవర్లు, లింకు రోడ్లు, ఆండర్ పాస్ బ్రిడ్జీలు నిర్మించుకున్నామని కెటిఆర్ సూచించారు. సామాన్యుల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్నపూర్ణ క్యాంటిన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. నగరంలో 95శాతం మంచినీటి సమస్య తీర్చామని, త్వరలో నాలాలు నిర్మించి ముంపు సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడేళ్లలో మూసీ నది సుందరీకరణ పూర్తవుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.