హైదరాబాద్: ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకూ రూ. 27వేల కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. రైతుబంధు పథకంతో సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్బీఐ నివేదికలో తెలిపిందని కెటిఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా మరో రూ.28వేల కోట్లు ఇచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని చెప్పారు. నేరుగా రైతుల ఖాతాలోకి రూ.56వేల కోట్లు జమ చేశామన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయం పాత్ర 300 రెట్లు పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి అసాధారణ విజయం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. దబ్బాకలో గతం కంటే ఎక్కవ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికలో బిజెపి, కాంగ్రెస్ రెండూ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.