ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్
అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల
కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్లో పర్యటించనున్నారని, ఈ పర్యటనకు స్థానిక ఎంపి బండి సంజయ్కుమార్ హాజరు కావాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మీడియా ద్వారా కూడా ఎంపి సంజయ్ను ఆహ్వానిస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవాలని సూచించారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు. కరీంనగర్లో జరిగే ఐదు కార్యక్రమాల్లో మంత్రి కెటిఆర్ పాల్గొంటారని తెలిపారు.
హరితహారంలో భాగంగా గతంలో సిఎం కెసిఆర్ మొక్కలు నాటిన చోటే మంత్రి కెటిఆర్ కూడా మొక్కలు నాటుతారన్నారు. అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఐటి టవర్ను ప్రారంభిస్తారని చెప్పారు. తీగల వంతెన పనులను పరిశీలించడంతో పాటు కరీంనగర్ పోలీసులు ఏర్పాటు చేసిన మియావాకి విధానంతో చిట్టడవులను పెంచే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కూడా మొక్క నాటుతారని మంత్రి గంగుల వివరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్ల నిర్మాణం తీరును పరిశీలించి అనంతరం నగరాభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను తిలకిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమం అంతా కూడా కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందన్నారు. ఐటి టవర్లో మొట్టమొదటగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మంత్రి కెటిఆర్ నియామక పత్రాలు ఇవ్వనున్నారని వివరించారు. ఐటి టవర్ల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. తీగల వంతెన వల్ల ఉత్తర భారతదేశ రాకపోకలకు సులువు కానుందన్నారు. ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని పలుమార్లు వినతి చేసినా ఎవరూ పట్టించుకోలేదని, టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ బ్రిడ్జికి మోక్షం కలిగిందని చెప్పారు. విలేకర్ల సమావేశంలో నగర మేయర్ వై.సునీల్రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.