Thursday, April 25, 2024

Malla Reddy:మరో ప్రపంచంలా హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

కీసరః ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీలు అద్భుతమైన ప్రగతిని సాధించాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శిల్ప నగర్‌లో రూ.90 లక్షలతో అభివృద్ది చేసిన పార్కును, 20వ వార్డులో రూ.కోటితో అభివృద్ది చేసిన వైకుంఠ ధామాన్ని, రూ.9.20 కోట్లతో చేపట్టిన ప్రధాన రహదారిని మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి ప్రారంభిచారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండటంతో నాగారం మున్సిపాలిటీ రూపు రేకలు మారుతున్నాయని అన్నారు.

పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ద్వారా రూ.200 కోట్లు కేటాయించిందని, పనుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు అయ్యాయని, వివిధ అభివృద్ది పనుల కోసం మరో రూ.15 కోట్లు మంజూరు కానున్నాయని మంత్రి వెల్లడించారు. పార్కులను, చెరువులను సుందరీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్ధవంతమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వంతో ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ నగరం మరో ప్రపంచంగా తీర్చి దిద్దబడిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసింది ఏమిలేదని విమర్శించారు.

బిజెపి అధికారంలో ఉన్న 19 రాష్ట్రాలలో ఎక్కడా ఇలాంటి అభివృద్ది జరగలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్ముంటే దేశ వ్యాప్తంగా రైతు బంధు, దళిత బంధు అమలు చేయాలని, ఇంటింటికి మంచి నీటి సరఫరా చేయాలి డిమాండ్ చేశారు. తెలంగాణలో మరోసారి రానున్నది కిసాన్ ప్రభుత్వమేనని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, కౌన్సిలర్లు కౌకుట్ల అనంత్‌రెడ్డి, అన్నంరాజు సుమిత్ర సురేష్, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, కౌకుట్ల రాహుల్‌రెడ్డి, చిన్నంరాజు సాయినాథ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News