Saturday, April 20, 2024

వైద్య రంగంలో మరో ముందడుగు…

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని, స్థానికంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి మరో ముందడుగు వంటిదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖానాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు… మహబూబ్ నగర్ కు రాష్ట్రంలోనే మొదటి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కూడా మంజూరు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలో మరో రెండు కళాశాలల పనులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల సొంత భవనాలు కూడా త్వరలో నిర్మిస్తామని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్ లో పదిమంది వైద్యులు 20 మంది నర్సులు మాత్రమే ఉండేవారని… ఇప్పుడు సుమారు వందమందికి పైగా డాక్టర్లు 400 మందికి పైగా నర్సులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. 2014 ముందు అత్యవసర వైద్యం అవసరం అయితే హైదరాబాద్ వెళుతున్న క్రమంలో అప్పన్నపల్లి రైల్వే గేట్ పడటం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థానికంగానే అత్యధిక ఉచిత వైద్యం లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖాన పేద రోగులకు ఎంతో భరోసానిస్తోందన్నారు.

రాబోయే ఏడాది కాలంలో పాత కలెక్టరేట్ వద్ద నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషల్ హాస్పిటల్ పనులు ప్రారంభించి గుండె, కిడ్నీ సహా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్ అనే స్థాయిలో వైద్య సేవలు అందించడమే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. చక్కని వైద్య సేవలు అందించిన వైద్యులు సిబ్బందికి తగిన గుర్తింపు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డా. కృష్ణ, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా జీవన్, వైద్యులు డా. రాధ, డా. శశికాంత్, కౌన్సిలర్లు షబ్బీర్, నీరజ విటల్ రెడ్డి, జిజిహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News