Friday, April 19, 2024

క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud met Anurag Thakur

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ప్రశంసలు గుప్పించిన
కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్

మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తెలంగాణలో క్రీడా అభివృద్ధికి సిఎం కెసిఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు శ్రీనివాస్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆరు వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని, క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్యా అభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడాకారుల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కేంద్రమంత్రికి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.

అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన క్రీడాకారులు, వివిధ అవార్డు గ్రహీతలు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, ప్రముఖ క్రీడాకారుల సూచనలు, సలహాలు తీసుకొని రూపొందిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ వల్ల క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, క్రీడాకారులకు, కోచ్‌లకు పెద్దపీట వేస్తున్నామని కేంద్ర మంత్రికి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు నిర్మాణం చేశామని, ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో తెలంగాణకు రెండో స్థానం లభించిందని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు, కోచ్‌లకు నగదు ప్రోత్సాహాకాలను గణనీయంగా పెంచామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు వివరించారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ ఏర్పాటుకు సిఎం కెసిఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News