Friday, March 29, 2024

చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి అని తెలిపిన అంబేద్కర్…

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారని… ఆ విధంగానే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు జై భీమ్ చౌరస్తా, బస్టాండ్ సమీపంలోని అభ్యంతరం కూడలిలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమానికి హాజరై రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహనీయుని త్యాగాలను మంత్రి మననం చేసుకున్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాత పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు… అంబేద్కర్ ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా నిల్చారని, పేదల అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేద ప్రజల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ స్మారకంగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టినట్లు వెల్లడించారు. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.దేశ రాజధానిలోను ఇంతకంటే భారీ విగ్రహాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనాదిగా ఎంతో వెనుకబాటుకు గురైన దళితుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధిదారునికి ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ పథకం ద్వారా దళితులకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని అన్నారు. మన రాష్ట్రంలో దళితబంధు మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న పేద దళితులను ఆదుకునేందుకు వెంటనే భారత దళితబంధు పేరిట పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, వైస్ చైర్మన్ గణేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజు, కౌన్సిలర్లు, నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News