Thursday, April 18, 2024

సినిమా టికెట్ ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -
Minister Talasani Srinivas Yadav On Movie Tickets Rates
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, డివివి దానయ్య, రాధాకృష్ణ, డైరెక్టర్‌లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నవీన్, వంశీ, బాలగోవింద రాజు, రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్‌రెడ్డిలు మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన రెండు సంవత్సరాల నుంచి కరోనా తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటుందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలన్నారు. థియేటర్‌ల యాజమాన్యాలు, ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, బీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా నిర్మాణ వ్యయాలు అధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందన్నారు. కరోనా వల్ల సుమారు రెండు సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు. టికెట్ ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకొని ధరలను పెంచి సినిమారంగాన్ని ఆదుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ ధరలపై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్‌లకు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News