Thursday, March 28, 2024

సున్నాలు వేసుకుని బతికితే నీకు కోట్లు ఎలా వచ్చాయ్?: వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు నరేంద్ర మోడీ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యాపారవేత్త అదానీ నరేంద్ర మోడీకి బినామీ అని ఆరోపించారు. అదానీకి దోచి పెట్టేందుకే దేశ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ అవినీతి అక్రమాలను కెసిఆర్ ఎండగట్టుతున్నందుకే ఇడితో దాడులు చేస్తున్నారని, ఎంఎల్‌సి కవితను ఆడబిడ్డ అని చూడకుండా గంటలకు కొద్ది విచారణ పేరుతో వేధిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లను ఖర్చుపెట్టి ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయాలని చూసి అడ్డంగా దొరికిపోయిన మోడీ, విచారణ జరిగితే జైలుకు పోతానని భయంతో తన చెప్పు చేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను ఇడి, సిబిఐ పేరిట దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు.

ఇడి, సిబిఐ దాడులకు బిఆర్‌ఎస్ నేతలు భయపడరని తేల్చిచెప్పారు. ఓటమి భయంతోనే బిజెపి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డిఆర్‌ఎస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ మీద నరేంద్ర మోడీ కక్ష కట్టి మనకు రావాల్సిన నిధులు, ప్రభుత్వ సంస్థలు రాకుండా అడ్డుకొంటున్నారని ఆరోపించారు. మోడీ అవినీతి, అక్రమాలను అంతమొందించే వరకు కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు పోరాటం ఆగదని, నరేంద్ర మోడీని దించుడు ఖాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఇచ్చుడు ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్ అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ తెలంగాణలో ఇచ్చే రైతు బంధు పథకాలు ఎందుకు ప్రవేశపెట్టరని ప్రశ్నించారు. పంటకు పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వరని? రైతులకు ప్రమాద బీమా ఎందుకు వర్తింప చేయరని?మహారాష్ట్ర రైతులు అడుగుతు న్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి బిజెపి నాయకులకు నిలదీస్తున్నారన్నారు. అక్కడి శెట్కరి రైతు సంఘం నాయకులు కెసిఆర్‌ను కీర్తిస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో నేడు అగ్గి పుట్టింది కెసిఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా గ్రామాలకు గ్రామాలు తరలివస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, బుడ్డర్ ఖాన్, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన దొంగ అని మంత్రి వేముల విమర్శించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న రేవంత్ రాహుల్ గాంధీ ఎంపి పదవి ఊడగొడితే ఏం మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. సున్నాలు వేసుకుని బతికే రేవంత్ రెడ్డికి బంజారాహిల్స్ లో బంగ్లా, వేల కోట్ల ఆస్తులు, కాన్వాయ్ వాహనాలు ఎక్కడివి? అని ప్రశ్నించారు. కెసిఆర్, కెటిఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News