చాంద్రాయణగుట్ట : శాలిబండ పోలీసులు సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్డన్సెర్చ్ను చార్మినార్ ఎంఎల్ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన అనుచరులతో కలిసి అడ్డుకోవటం పాతబస్తీలో కలకలం సృష్టించింది. విధి నిర్వాహణలో భాగంగా ఫలక్నుమా ఎసిపి మహ్మద్ మజీద్ పర్యవేక్షణలో శాలిబండ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులు శక్కర్గంజ్, రూప్లాల్బజార్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి స్థానికతను తెలిపే ఏదైన దృవపత్రాన్ని చూపాలని కోరారు. అందుకు వారు తమ వద్ద గల ఆధార్, రేషన్కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు తదితరాలను చూపించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతలో ఈ సమాచారం అందుకున్న ఎంఎల్ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ బస్తీవాసులు, అనుచరులతో కార్డన్సెర్చ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని ఎసిపి మజిద్తో వాగ్వివాదానికి దిగారు.
ప్రస్తుతం దేశం, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఆధార్కార్డులను ఎందుకు అడుగుతున్నారని ఎంఎల్ఎ ఎసిపిని ప్రశ్నించారు. పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే తనిఖీల్లో భాగంగానే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎసిపి ఎంఎల్ఎకు వివరించారు. దీంతో ఎంఎల్ఎ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్ఆర్సి, సిఎఎ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిని కార్డన్సెర్చ్ పేరుతో మరింత భయాందోళనకు గురి చేయటం ఏంటని నిలదీశారు. వెంటనే తనిఖీలను ఆపేయాలని ఆయన ఎసిపిని డిమాండ్ చేశారు. అప్పటికే కార్డన్సెర్చ్ పూర్తి కావటంతో పోలీసులు తనిఖీలు నిలిపివేస్తున్నట్లు సిబ్బందికి తెలిపి అక్కడి నుంచి నిష్క్రమించారు.