మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం మేరకే కేంద్ర రాష్ట్రాసంబంధాలు కొనసాగుతున్నాయే కానీ రాజకీయ సంబంధాలు కావని రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నెప్రభకర్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని మంత్రి కిషన్రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్ మెట్రోరైలుకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని మంత్రి కిషన్రెడ్డి చేస్తున్న ఆరోపణలు అసత్యాలని ఆయన చెప్పారు. కేంద్రంతో రాష్ట్రం చేసుకున్న ఆధికారిక ఒప్పందం మేరకే కేవలం రూ.1200కోట్లు ఇచ్చిందేకానీ అదనంగా ఒక్కపైసాకూడా ఇవ్వలేదవని ఆయన చెప్పారు. ఆదివారం టిఆర్ఎస్ ఎల్పిలో కర్నె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఒకవిధంగా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మరోవిధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు తాముప్రాతినిథ్యం వహించే రాష్ట్రాలకు నిధులుకావాలని పట్టుబడతారు కానీ కిషన్రెడ్డి మాత్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పైగా తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వదని చెపుతున్నారని ఆరోపించారు. కిషన్రెడ్డికి ఓటువేసిన సికింద్రాబాద్ ఓటర్లు కిషన్రెడ్డిని ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారన్నారు.
మెట్రో ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంతోనే నిత్యం విమర్శలు చేసే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఉద్ధేశపూర్వకంగా, అసత్య ఆరోపణలతో కిషన్రెడ్డి ప్రోటోకాల్ వివాధాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. మోట్రో ప్రారంభోత్సవ అధికార ప్రకటనల్లో ప్రధాని మోడీ ఫోటోలను కూడా వేసిన విషయాన్ని కిషన్రెడ్డి గమనించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఏదైన ఉన్నతమైన ప్రాజెక్టును తీసుకువస్తే పౌరసన్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నెప్రభాకర్ చెప్పారు. కిషన్రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు హుందాగా వ్యవహరించకపోతే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి గౌరవంకూడా పోతుందని ఆయన హెచ్చరించారు.
MLC Karne Prabhakar fires on Minister Kishan Reddy