Friday, March 29, 2024

ప్రజా వంచక కేంద్ర బడ్జెట్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని రుణాల కుప్పగా మార్చింది. మానవా భివృద్ధిని ఏ మాత్రం పెంచకపోగా మరింత కుంగతీసింది. సంపన్న ఆర్ధిక వ్యవస్థ దేశాల జాబితాలో 5వ స్థానం అనే వెలుగులో మానవ జీవన ప్రమాణ సూచికలో 132 వ అధమ స్థానం అనే నీడను విస్మరించింది. ప్రపంచ పేదలలో ప్రతి ఐదుగురిలో నలుగురు భారత్ లోనే ఉన్నారు. ఉద్యోగ కల్పన లేని ఆర్ధిక వ్యవస్థతో నడిచే రాజకీయాలనే మోడీ నడుపుతున్నారు. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది.

రూపాయి రాకలో 30% అప్పుల నుండి పోకలో 20% వడ్డీల చెల్లింపుల దుస్థితికి దేశాన్ని నెట్టి వేశారు. ఆర్థికాభివృద్ధికి సాంకేతిక జ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్యం చోదక శక్తులుగా పని చేస్తాయని చెప్తూ వాటికి జిడిపిలో 6%, 1% నిధులు ఇవ్వాల్సి ఉండగా పావు శాతం కూడా కేటాయించలేదు. నూతన విద్యా విధానం 2020 ఊదరగొట్టిన మోడీ ఆచరణలో జిడిపిలో 0.60% అనగా రూ. 1.12 లక్షల కోట్లు ఇచ్చారు. కరోనా మహమ్మారి వలన దిగువ స్థాయి ప్రైవేట్ బడులు మూతబడ్డాయి. విద్యార్థులలో అభ్యసన స్థాయిలు పడిపోయాయి. దీనిని భర్తీ చేయటానికి రెమిడీయల్ తరగతుల నిర్వహణ అవసరం. annual status of education report ప్రకారం ప్రభుత్వ బడులలో నమోదు శాతం అనుహ్యంగా పెరిగింది.

మౌలిక సౌకర్యాల కల్పన, టీచర్స్ పోస్ట్‌ల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సందర్భంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ప్రజల హక్కుగా ప్రభుత్వ విద్య అనే రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లఘించారు. 85% పిల్లలో మెదడు వికాసం 6 ఏండ్లు లోపల జరుగుతుంది. ఈ ప్రక్రియలో అంగన్ వాడీల పాత్ర కీలకం. ఈ రంగానికి నిధులను తక్కువ చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో అంశం. రాష్ట్రాలకి కేటాయింపులు కనిష్ఠ స్థాయికి చేరాయి. దీనితో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీల నిర్వహణలో వెనుకబడిపోతున్నాయి. అంతరిక్ష, అన్ని సాంకేతిక పరిశోధన సంస్థలకి నిధుల్లో భారీ కోత విధించింది. ఆదివాసీ, దళిత మైనారిటీలపై కక్షపూరిత ధోరణులు ఈ బడ్జెట్‌లో కనిపించాయి. వీరికి వృత్తి విద్యా కోర్సులలో ఇచ్చే ఉపకార వేతనాల బడ్జెట్‌లో 38% భారీ కోతను విధించారు. దీనితో సృజనాత్మక నైపుణ్య పౌరులను రూపొందించాలన్న ప్రక్రియ, అభ్యసనలో అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరువ చేస్తామనే మోడీ హామీ ఒక డొల్లగా మారింది.

మానవ ఆరోగ్య సూచికలో భారత్ 179వ స్థానానికి చేరుకుంది. జిడిపిలో 3% నిధుల హామీని విస్మరించి రూ. 88956 కోట్లను అనగా జిడిపిలో 0.36% మాత్రమే ఇచ్చింది. ప్రైవేట్ వైద్య ఖర్చుల వలన ప్రతి ఏటా ఆరు కోట్ల ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రెండవ, మూడవ స్థాయి వైద్య స్థాయికి మాత్రమే రూ. 5 లక్షల సహాయం ఉంది. దీనిని మొదటి స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరింపచేసి 70% నిధులను ఇవ్వాలి. ప్రతి పది వేల మందికి 20 పడకలు, 24 ఆరోగ్య సిబ్బంది ఉండాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 నిర్దేశించింది. దీనిపై చిత్తశుద్ధి లేని మోడీ గ్రామీణ ప్రజల జీవనరేఖగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఇచ్చిన రూ. 10 లక్షల కోట్ల నిధులు తన తాబేదార్లుగా ఉండే కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. రైతుల ఉసురు తీస్తూ వచ్చిన మోడీ ఈసారి రూ. 20 లక్షల కోట్ల రుణ సౌకర్యం కల్పన చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మరొక సారి రైతులను వంచన చేసి మభ్యపెట్టేదిగా ఉంది. 2022 -23 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఈసారి ఎరువుల సబ్సిడీ 13% తగ్గించారు. ఆహార సబ్సిడీకి 2.48%, వ్యవసాయ దాని అనుబంధ రంగాలకి 4% నిధులను తగ్గించారు. వీటి వలన రైతాంగ జీవనం మరింత సంక్షోభంలోకి నెట్టి వేశారు. దీనికి తోడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 33% నిధులు తగ్గించి సన్నకారు రైతుల, కూలీలపై వికృత సర్జికల్ దాడి చేశారు. ఆదాయ మార్గాన్ని వారి కొనుగోలు శక్తిని పెంచే ఉపాధి హామీ పథకాన్ని 2014 నుండి నిర్వీర్యం చేస్తూ వచ్చారు.

వంద రోజుల పని కల్పనకి రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరం. గత 9 ఏళ్లలో 45-48 పని దినాలు కల్పన మాత్రమే జరిగింది. 40 రోజుల పని కల్పనకి రూ. 1.24 లక్షల కోట్లు అవసరం. కానీ ఈ బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. 90% శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వీరి వాటా 50% ఉంది. వీరి సామాజిక భద్రత రూ. 16,893 కోట్ల నుండి రూ. 13,221 కోట్లకు తగ్గించారు. వీరికి అందించే రూ. 10 లక్షలు విలువ గల బీమా యోజన ఆపివేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ 1950- 2014 వరకు ఆనాటి ప్రపంచ ఆర్ధిక పోకడలతో పోల్చినప్పుడు మెరుగైన ఫలితాలను కనపర్చింది. మోడీ 9 ఏండ్ల పాలనలో ఆ క్రమాన్ని కొనసాగించడంలో వెనుకబడింది. గంభీరంగా ఉదాత్త పదాలతో అమృత కాలంలో జాతీయోద్యమ వీరుల ఆశల ప్రతిఫలిస్తున్నదని చెప్పుకున్నది. సమీకృత అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ చేరువకావడం, మౌలిక వసతుల కల్పన, సామర్థాలను ఆవిష్కరించడం, గ్రీన్ గ్రోత్, యువశక్తి, ఆర్ధిక సామర్ధ్యం అని బిజెపి ప్రవచించిన సప్తర్షి సూత్రం కాగితాలకే పరిమితం చేసుకుంది. ప్రభుత్వ రంగాన్ని తగ్గించి కార్పొరేట్ శక్తులను పెంచడానికి మోడీ బడ్జెట్ తోడ్పడుతున్నది. సంపద బొట్లు బొట్లుగా జారే సిద్ధాంతాని వదిలి కేంద్రీకృతం చేయడంలో సఫలమైంది. ఇదే ఫాసిజముకు అవసరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

అస్నాల శ్రీనివాస్
9652275560

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News