కేవదీయ/అహ్మదాబాద్: శుక్రవారం ప్రధాని మోడీ గుజరాత్లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఆరోగ్యవ్యాన్లో 380 జాతులకు చెందిన ఐదు లక్షల ఔషధ మొక్కల్ని పెంచనున్నారు. ఆరోగ్య వ్యాన్లో యోగా కేంద్రం, డిజిటల్ సమాచార కేంద్రం, ఆయుర్వేద ఆహారాన్ని అందించే కేఫ్ను కూడా ఏర్పాటు చేశారు. గార్డెన్లోని సౌకర్యాలను ప్రధాని మోడీ పరిశీలించారు. గుజరాత్లో శనివారం కూడా పర్యటించనున్న ప్రధాని మోడీ మొత్తం 17 ప్రాజెక్టులను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
కేశూభాయ్ కుటుంబాన్ని
పరామర్శించిన ప్రధాని
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్(92) కుటుంబసభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళ్లిన ప్రధాని, అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా గాంధీనగర్లోని కేశూభాయ్ ఇంటికి చేరుకున్నారు. గురువారం కేశూభాయ్ మరణించిన విషయం తెలిసిందే. గుజరాత్లో మొట్టమొదటి బిజెపి ప్రభుత్వం కేశూభాయ్ నేతృత్వంలోనే ఏర్పాటైంది. కేశూభాయ్తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుజరాత్ సూపర్స్టార్ నరేశ్కనోడా, ఆయన సోదరుడైన సంగీత దర్శకుడు మహేశ్కనోడా కుటుంబాలను కూడా ప్రధాని పరామర్శించారు. నరేశ్కనోడా(77) కరోనాకు చికిత్స పొందుతూ అక్టోబర్ 27న మృతి చెందగా, ఆ తర్వాత రెండు రోజులకు వృద్ధాప్య సమస్యలతో మహేశ్ కనోడా(83) మృతి చెందారు. నరేశ్ బిజెపి మాజీ ఎంఎల్ఎ కాగా, మహేశ్ మాజీ ఎంపీ. నరేశ్ కుమారుడు హితూ కనోడా బిజెపి సిట్టింగ్ ఎంఎల్ఎ.