హైదరాబాద్ : దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్తో పాటు మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజుల్లో కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మొత్తం ప్రాంతాలు, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, మధ్య ఈశాన్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో 3.1 కి.మీల నుంచి 5.8 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్ప డిందని, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా జూన్ 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.