అతిషి మార్లెన …ఆధునిక భావాలుగల మహిళ. పేరులోనే ఓ ప్రత్యేకత గలది. కార్ల్మార్క్, లెనిన్ల స్ఫూర్తితో అతిషికి చివర మార్లెన అని చేర్చారు ఆమె తల్లిదండ్రులు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా ప్రయాణించడం ఆమెకు నేర్పారు. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడం వల్లే ఆమె ఢిల్లీ వాసులకు ప్రియతమురాలైంది. అందరికీ ఆదర్శమూర్తిగా మారింది. ఇంతకీ ఆమె చేసిన పనులేంటో చూద్దాం..
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసింది. 2001లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం అందుకుంది. తర్వాత ఉపకార వేతనంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆక్స్ఫర్డ్ మాగ్డలెన్ కాలేజీలో రోడ్స్ స్కాలర్గా ఎంపికైంది. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు మదనపల్లిలో ఉన్న రిషీ వ్యాలీ పాఠశాలలో చరిత్ర, ఇంగ్లిష్లను బోధించింది. తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలో ఓ గ్రామానికి వెళ్లింది. అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూనే, విద్యాబోధన చేపట్టింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విలువలు నచ్చడంలో అందులో చేరింది.
2013లో ఆప్ విధానాల రూపకల్పనలో అతిషి భాగస్వామి అయ్యింది. పొలిట్బ్యూరోలో సభ్యురాలైనా తన అవసరం ఉన్న అందరికీ అందుబాటులో ఉండేది. 2015లో మధ్యప్రదేశ్లో జరిగిన ‘జల సత్యాగ్రహ’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక అతిషి కీలక బాధ్యతలు చేపట్టింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు విద్యకు సంబంధించిన అంశాలపై సలహాదారుగా నియమితురాలైంది. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది.
ఈమె కాలంలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. 8,000 సరికొత్త తరగతి గదుల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం జరగడం మొదలైంది. నర్సరీ స్థాయి నుంచి ‘హ్యాపీనెస్ కరికులం’ అమలు మొదలైంది. నైతిక విలువలు నేర్పించడం ప్రారంభమైంది. అతిషి సంస్కరణలు ఫలించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. విద్యార్థి దశలోనే నైతికత నేర్పించాల్సిన అవసరం ఉందంటోంది అతిషి.