హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 24గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురేసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ఇవాళ, రేపు,ఎల్లుండి పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కోమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, వరంగల్ రూరల్, మహభూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని కొన్ని జిల్లాలో పంటలు నాశనం అయ్యాయి. పంటపొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఇటు ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.